
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన కొనుగోలుదారులపై భారం వేయడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దీని వల్ల వాహన తయారీదారులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు వేలాది మంది ఉన్నారని, వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు . విచిత్రం ఏమిటంటే పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. కానీ వాటిని అమలు చేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకు పడటం దుర్మార్గమైన చర్య గా ఆయన పేర్కొన్నారు. రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ. 2000 నుంచి రూ. 10000 వరకూ అదనపు భారం వేయడం పేద, మధ్య తరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడం తప్పా మరోటి కాదన్నారు కేటీఆర్. రెండేళ్లు కావొస్తున్నా ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముక్కుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్ర చేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరని హెచ్చరించారు.