ఆయన నాయకత్వం స్పూర్తి దాయకం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు దమ్మున్న లీడర్ అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు’ వంటి విధానాలను అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అంద జేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతకు ఈ అవార్డే నిదర్శనమన్నారు.
సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత. ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సీబీఎన్ ఇమేజ్ తోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హర్టీకల్చర్ వంటి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా సీఎం చంద్రబాబు తీర్చి దిద్దుతున్నారన్నారు. విజన్ 2020తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన చంద్రబాబు, నేడు 2047తో నవ్యాంధ్రను దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారని సవిత కొనియాడారు.






