ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
ముంబై : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన బాల్ థాక్రే ఎంపీ సంజయ్ రౌత్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం చనిపోదు, . ఓడిపోదు ఎందుకంటే దేశ ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యం మరోసారి శిఖరాలను అధిరోహిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, గెలుపునైనా, ఓటమినైనా అంగీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనైతికమని పేర్కొన్నారు.
నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాస్వామ్యం అనేది గెలిచి ఉండేదన్నారు సంజయ్ రౌత్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. డెమోక్రసీకి ఢోకా లేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాజకీయాలు చేశారని ఆరోపించారు. అందుకే భారతీయ జనతా పార్టీ గెలుపొందిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పరోక్షంగా, ఇతోధికంగా సపోర్ట్ గా నిలిచిందని, దాదాపు 100కి పైగా సీట్లకు లోపాయికారిగా మద్దతు ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సంజయ్ రౌత్. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు దక్కుతుందన్నారు.






