నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వ సలహాదారు
హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది.
సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన దిశగా సాగుతున్న ఈ చారిత్రాత్మక ప్రజాస్వామ్య పోరాటానికి ఏఐఓబీసీఎస్ఏ గట్టిగా అండగా నిలుస్తుంది. ఓబీసీల వాస్తవ సామాజిక-ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, రాజ్యాంగ రక్షణలు, సంక్షేమ విధానాలను నిష్పక్షపాతంగా అమలు చేయడానికి సమగ్ర కుల గణన నిర్వహించడం అత్యవసరం అని అభిప్రాయపడింది.
ఏఐఓబీసీఎస్ఏ తరపున, జాతీయ సలహాదారు ఇంజనీర్ అల్లా రామకృష్ణ, జాతీయ కార్యదర్శి , హెచ్సీయూ యూనిట్ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య (లక్కీ), తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ గౌడ్, ఓయూ ఉపాధ్యక్షుడు శివ యాదవ్, ఇతర ప్రతినిధులు వ్యక్తిగతంగా సంఘీభావ లేఖను అందజేశారు వీ హెచ్ కు. సంస్థ అచంచలమైన మద్దతును తెలిపారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు వి. హనుమంత రావు.





