కార్యకర్తలపై దాడులకు పాల్పడితే బాగుండదు
అమరావతి : తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల పట్ల ఏపీ ఖాకీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోమన్నారు. కడప లో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషం గా వ్యవహరించారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు మాధవ్.
కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు . పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తుల జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ పోలీసుల తీరుపై మండి పడ్డారు. డీఎస్పీ అధికారం ఉందని దాడికి పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. ఈ దాడికి సంబంధించిన అంశాన్ని సర్కార్ దృష్టికి తీసుకు వెళుతున్నామని చెప్పారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియో ను మీడియా కు విడుదల చేశారు.





