ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన ఫ్లైట్ తోక
బెంగళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం నిలిపి వేశాడు పైలట్. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే విమానంలో ఉన్న ప్రయాణీకులు సేఫ్ గా ఉండేవారు కాదు. ఎయిర్లైన్కు చెందిన నారో-బాడీ A321 విమానం ఢిల్లీ నుండి బెంగళూరుకు AI2651 ఫ్లైట్ను నడుపుతోంది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో 181 మంది ప్రయాణికులతో వెలుతున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో తోక నేలను తాకడంతో, సమగ్ర తనిఖీ కోసం విమానాన్ని నిలిపి వేశారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సాధారణంగా దిగిపోయారని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. విమానం ల్యాండ్ కావడానికి దగ్గరగా ఉన్నప్పుడు “వేక్ టర్బులెన్స్”ను ఎదుర్కొందని, ఆ తర్వాత పైలట్ గో అరౌండ్ విన్యాసం చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. సమీపంలో ఒక పెద్ద విమానం టేకాఫ్ అవ్వడం వల్ల “వేక్ టర్బులెన్స్” ఏర్పడిందని చెప్పారు. విమానాన్ని సమగ్ర తనిఖీ కోసం నిలిపి వేశామని, సంబంధిత నియంత్రణ అధికారుల సమన్వయంతో, నిర్దేశిత విధానాల ప్రకారం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ప్రకటించారు.





