మే 31 వరకు అంగరంగ వైభవోపేతంగా
తిరుపతి : తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్య మానంగా వెలుగొందుతుంటాడు. ముత్యపు పందిరిపై వెలసే స్వామి వారి రూపం భక్తులకు మనోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యాలు చల్లదనానికి సంకేతం. సముద్రగ ర్భం ప్రసాదించిన అమూల్య రత్నమైన ముత్యాల కింద వెలసిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని నింపుతుందనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది.
చంద్ర వాహనం, సింహ వాహనంపై శ్రీ గోవింద రాజ స్వామి మాడ వీధుల్లో ఊరేగారు. వేలాది మంది భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







