ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు
న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 లక్షల మందిక పైగా నీట్ యుజీ 2026 పరీక్ష రాశారు. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన గుజరాత్ లో పేపర్ లీక్ అయ్యింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్రం. ఇందులో కీలకమైన పాత్ర బీజేపీకి చెందిన లీడర్ ఉన్నట్లు తేలింది. తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పరీక్షను నిర్వహిస్తున్న ఎన్టీఏ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నిసార్లు లీక్ అయితే పాఠాలు నేర్చుకుంటారా అని నిలదీసింది సుప్రీంకోర్టు.
ఇదిలా ఉండగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తరఫున న్యాయవాది తన్వి దుబే దాఖలు చేసిన పిటిషన్పై నోటీసు జారీ చేసింది . ఇదే అంశానికి సంబంధించి దాఖలైన అన్ని కేసులను కలిపి విచారిస్తున్నట్లు తెలిపింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం పరీక్షా సంస్థ స్థానంలో ఒక పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం, ఎన్టీఏ, సీబీఐల నుంచి స్పందన కోరింది. గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోక పోవడం విచారకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్లు పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం, పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు ఇతర పార్టీలకు అందజేయాలని ఆదేశించింది.





