మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్
విజయవాడ : మాజీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన మరోసారి ఇదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో నా నివాసంలో జరిగిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్పై ఉన్న సీలును ఈడీ అధికారులు ఈ రోజు తొలగించారని వెల్లడించారు. అయితే ఈడీ అధికారులు ఎటువంటి విచారణ జరప లేదన్నారు విజయ సాయి రెడ్డి. వారు కేవలం ఫోన్లోని డేటాను మాత్రమే సేకరించారని చెప్పారు.
సేకరించిన ఆ డేటా ఆధారంగా, వారు ప్రశ్నలను రూపొందించి, వేరొక రోజు విచారణకు హాజరు కావాలని నాకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు మాజీ ఎంపీ. ఈ ‘లిక్కర్ పిరమిడ్ స్కీమ్’ వ్యవహారంలో, ‘రాజ్ కాసిరెడ్డి’ అనే వ్యక్తే అసలైన సూత్రధారి, కార్యకర్త , ప్రధాన పాత్రధారి అని సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఈ స్కాంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ కొందరు కావాలని తన పేరును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ రోజు నేను చెప్పిన మాటే, ఈ రోజు కూడా చెబుతున్నాను.. భవిష్యత్తులోనూ నేను ఈ మాటలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.







