నిప్పులు చెరిగిన పాశం యాదగిరి
హైదరాబాద్ : తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, ఇంటెలెక్చువల్ గా పేరు పొందిన పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవర్రా మీరంతా అంటూ మండిపడ్డారు. ఇంకెంత కాలం ఈ ప్రాంతంపై పడి దోచుకుంటారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రధానంగా ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు. ఈ ఇండస్ట్రీలో ఉన్నవారికి విద్య, సంస్కారం, నైతిక విలువలు కొరవడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు పాశం యాదగిరి.
అక్కడ కేవలం తాగుబోతులు, వాచాలత్వం ఉన్నవారే కనిపిస్తారని అన్నారు. ఇప్పటి వరకు వారు ఒక్క దేశభక్తి చిత్రాన్ని కూడా తీయలేదని మండిపడ్డారు. వారు తీసినవన్నీ చెత్త సినిమాలేనని అన్నారు. చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే ఒక పొరపాటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ కోవకు చెందిన వాడేనని నిప్పులు చెరిగారు. గతంలో ఎన్.టి. రామారావుపై దాడి చేసి, ఆయనను చెప్పులతో కొట్టినవారే ఇప్పుడు ఆయన విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చే గెవారా పోస్టర్ పెట్టుకుని, తాను ఒక కమ్యూనిస్టునని చెప్పుకుంటూ.. జనకవి గద్దర్ను ఒప్పించి పవన్ కళ్యాణ్ను మోసం చేసి, వంచించాడని సంచలన ఆరోపణలు చేశారు.







