ఇద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు
హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయని, దీనిని పరిష్కరించే ధైర్యం, దమ్ము, చేతకాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఫైర్ అయ్యారు. ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ఈ ఇద్దరు నేతలు కలిసి కొత్త ప్లాన్ కు తెర లేపారన్నారు.
ఇక్కడి ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం తప్ప మరోటి కాదన్నారు జగదీశ్ రెడ్డి. పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహిస్తే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయా? అని ప్రశ్నించారు. తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడమే వారి ‘మ్యాచ్ ఫిక్సింగ్’ను బట్టబయలు చేస్తోందని అన్నారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు ఛీ కొట్టడం ఖాయమన్నారు. అసలు ఏపీలో ఉండాల్సిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు.





