ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న అదనపు ఎస్పీ అధికారి హోదాలో పని చేసిన భుజంగరావు ఇళ్లలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు ను గతంలోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన నివాసాలు.. బంధువు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ దాడులకు దిగడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఎప్పటినుండో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏసీబీ సోదాలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆయనకు చెందిన పదిహేను చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.





