ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశం
అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మాతృభాష తెలుగును విస్మరించ వద్దని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి విద్యార్థులకు అందజేయాలని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఇప్పటి నుంచే వారికి అదనపు తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగు పర్చడంపై టీచర్లు శ్రద్ధ వహించాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా హైస్కూలు విద్యార్థులకు క్రోమ్ బుక్స్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ అందజేతకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్ ఛార్జి) శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





