స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత
కడప జిల్లా : ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. పూలే దంపతుల ఆశయాల సాధన కోసం బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. వసతి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, అందుకే ఎంజేపీ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రాక్ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే స్పోర్ట్స్ కిట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
బీసీ హాస్టళ్లు, గురుకుల్లాల్లో చదవే తమ బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నామని చెప్పారు ఎస్. సవిత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ నియోజక వర్గంలో బీసీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల జూనియర్ కళాశాల ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.






