నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన వల్ల పాలన గాడి తప్పిందన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయితే… ఇప్పుడు వచ్చిన ‘రేవంత్ రెడ్డి’ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఒక సినిమా విఫలమైతే నిర్మాతలు నష్టపోతారని , కానీ ‘రేవంత్ రెడ్డి’ అనే ఈ సినిమా వల్ల తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
షంషాబాద్కు చెందిన ఒక వ్యక్తి నాకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చారు. తమ పూర్వీకుల భూమిని ‘నిషేధిత జాబితా’లో చేర్చిన విషయంపై రాజకీయ నాయకులను అడిగితే, ఎకరాకు కోటి రూపాయలు ఇస్తే ఆ జాబితా నుంచి తొలగిస్తామని చెబుతున్నారని ఆయన తన ఆవేదనను పంచుకున్నారని బాంబు పేల్చారు . “రెండేళ్లపాటు నా భూమిని ఎలాగోలా కాపాడుకుంటాను, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక వాళ్లు పరిణామాలు ఎదుర్కోవాల్సిందే సార్” అని తను నాతో తన బాధను వెళ్లగక్కారని అన్నారు కేటీఆర్.






