ప్రశంసలు కురిపించిన అలీషా అబ్దుల్లా
చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియన్ అయిన అలీషా అబ్దుల్లా బుధవారం మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలైని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తలైవర్’ అన్నామలై ని తన నివాసంలో కలిసే అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉందన్నారు. నా మనసులో ఉన్న ఒక విషయాన్ని నేను తప్పక చెప్పాలి. నేడు నేను ఈ స్థాయికి రావడంలో అన్నామలై అన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నా రాజకీయ ప్రస్థానం ఆరంభంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన దశల్లో ఆయన నాపై నమ్మకం ఉంచి, నన్ను తీర్చిదిద్ది, నాకు అండగా నిలిచి మద్దతునిచ్చారు.
ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం,, అచంచలమైన మద్దతు నాకు ఎదగడానికి అవసరమైన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అన్నామలై తన నిబద్ధత , అంకితభావంతో ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ప్రతికూలతను వ్యాప్తి చేస్తూ, ఆయన గురించి చెడుగా మాట్లాడటంలోనే సమయం గడిపే వారికి ఒక మాట: బహుశా వారు తమ సొంత జీవితాల్లో ఏదైనా అర్థవంతమైన పని చేయడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.మార్పు కోసం కృషి చేసే వారిని విమర్శించడం ద్వారా కాదు, ఆచరణ ద్వారానే నిజమైన నాయకత్వం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు అలీషా అబ్దుల్లా.






