స్మార్ట్ కిచెన్ లను సమర్థించిన మంత్రి
అమరావతి : ఆరు నూరైనా సరే ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్లను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి నారా లోకేష్. కావాలని మాజీ సీఎం జగన్ రెడ్డి దీనిపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ కిచెన్ పథకం వల్ల దాదాపు 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోతారని ఆరోపించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకమైన , నాణ్యమైన భోజనాన్ని అందించడం, అదే సమయంలో మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు అదనపు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ కిచెన్ పథకాన్ని తీసుకు వస్తోందన్నారు.
స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తన మద్దతుదారులకు లబ్ధి చేకూర్చుకోవడానికి వాడుకుంటూ, ఇప్పటికే ఉన్న మహిళా కార్మికులను అనిశ్చితిలోకి, నిరుద్యోగంలోకి నెడుతోందని జగన్ ఆరోపించారు. వైఎస్సార్సీ అధినేత విమర్శలను ఖండిస్తూ, పేద పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగు పరచడానికి రూపొందించిన కార్యక్రమంపై అభ్యంతరాలు లేవనెత్తడం దురదృష్టకరమని లోకేష్ అన్నారు. మెరుగైన ఆహార ప్రమాణాలను కల్పించి, వేలాది మందికి జీవనోపాధిని అందించే కార్యక్రమాన్ని ఎవరైనా ఎందుకు వ్యతిరేకించాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా ఐదు స్మార్ట్ కిచెన్లను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.





