నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కీలక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. సిద్దిపేటలో పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశమైన సందర్భంగా నల్గొండలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశం తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పడానికి బదులుగా, తనపై వ్యక్తిగత దాడిని ఎందుకు ఎంచుకున్నారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
BRS అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తో పాటు తనపై ముఖ్యమంత్రి పదేపదే చేస్తున్న విమర్శలు ఆయనలో పెరుగుతున్న రాజకీయ అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, 2028 లేదా 2034 వరకు అధికారంలో ఉంటామని మీరు నిజంగా నమ్మితే, ఈ రోజే అసెంబ్లీని రద్దు చేయండి. మా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు . తెలంగాణను పాలించే అర్హత ఎవరికి ఉందో ప్రజలే నిర్ణయించు కోనివ్వాలని అన్నారు.






