
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : అడ్డగోలు హామీలతో పవర్ లోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. శనివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , కేటీఆర్ , మాజీ స్పీకర్ మధుసూదనా చారి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే రిబ్బన్ కటింగ్ లేదంటే సంక్షేమ పథకాలకు కటింగ్ పెట్టాడని ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు పది రోజులు అసెంబ్లీ పెట్టాలంటే ఒక్క రోజు కాళేశ్వరం మీద పెట్టి పారి పోయాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల మీద అక్కసు వెల్లగక్కడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు హరీవ్ రావు. రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు లేదు, ఏమార్పు తప్ప అంటూ మండిపడ్డారు.
ప్రజలను మోసం చేసిండు. నయవంచన చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారని కానీ వాటి గురించి పట్టించుకున్న పాపోన పోలేదన్నారు. అందుకే తాము ఇవాళ బాకీ కార్డులను మేం ఇంటింటికి పంచుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్, పీఆర్సీ గురించి మాట్లాడటం లేదన్నారు. ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని దగా చేశారన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలను మోసం చేశారని వాపోయారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు అందరూ మోస పోయారని పేర్కొన్నారు.