
భారత దేశంలో అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో టాప్ లో కొనసాగుతోంది రైల్వే శాఖ. దీని బడ్జెట్ మొత్తం రూ. 2,55,445 కోట్లుగా కేటాయించారు. స్వంత ఆదాయం రూ. 3,02,100 కోట్లు. 2025-26 సంవత్సరానికి 8.3 శాతం పెరుగుదల ఉంది. అత్యధిక మూలధన ఖర్చు రూ. 2.65 లక్షలు. ఇందులో రూ. 1,16,514 కోట్లు ట్రాక్ రీన్యువల్, సిగ్నలింగ్, టెలికాం, కొత్త రైల్ కట్టింగ్, రోబ్స్/రవ్స్ నిర్మాణం వంటి ముఖ్య ప్రాజెక్టుల కోసం కేటాయించారు.కొత్త రైళ్ల నిర్మాణం కోసం రూ. 32,235.24 కోట్లు , గేజ్ మార్పుల కోసం 4,550 కోట్లు, డబిలింగ్ చేపట్టేందుకు రూ. 32,000 కోట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలు ఈ శాఖకు కేటాయించినా ఇప్పటి వరకు కోట్లాది మందిని నిత్యం గమ్య స్థానాలకు చేరుస్తున్న రైళ్లల్లో కనీస వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కాగ్ తేల్చి చెప్పింది. ఇది ప్రభుత్వ సంస్థ. రైల్వే శాఖ నిర్వహణ, నిర్లక్ష్యంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశ బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ ను కలిగి ఉన్న రైల్వే శాఖ గతి తప్పింది.
సదరు శాఖ పనితీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా నిర్వహణ లోపం పట్ల పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. 2022-23 సంవత్సరంలో రైల్వే టాయిలెట్లలో నీటి కొరతపై 1 లక్షకు పైగా ఫిర్యాదులు రావడం విస్తు గొల్పేలా చేసింది. ప్రయాణీకుల రద్దీ గణనీయంగా ఉన్నందున, అధిక పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఇది పూర్తిగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. రైల్వేల కోచ్లలో టాయిలెట్లు, వాష్ బేసిన్లలో నీరు అందుబాటులో లేక పోవడంపై భారతీయ రైల్వేలు మొత్తం 1, 00,280 ఫిర్యాదులను అందుకున్నాయని కంప్ట్రోలర్ . ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్ ) పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 33.84 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న 33,937 కేసుల్లో, ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి తీసుకున్న సమయం అంచనా వేసిన కాలక్రమాన్ని మించి పోయిందని పేర్కొంది.
2018-19 నుండి 2022-23 వరకు రైళ్లలో పరిశుభ్రత, పారిశుధ్యం పనితీరు ఆడిట్ను ఆడిట్ నివేదిక వివరించింది. ప్రయాణీకుల రద్దీ గణనీయంగా ఉన్నందున, అధిక పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడం కీలకమైన ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్పింది. సుదూర రైళ్లలో బయో-టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి, ఎంపిక చేసిన 96 రైళ్లలో 2,426 మంది ఆన్బోర్డ్ ప్రయాణీకులతో సమగ్ర సర్వే నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. సర్వే చేయబడిన ప్రయాణీకులలో సంతృప్తి స్థాయి ఐదు జోన్లలో 50 శాతం కంటే ఎక్కువగా ఉండగా, రెండు జోన్లలో ఇది 10 శాతం కంటే తక్కువగా ఉంది. 33,937 కేసుల్లో (33.84 శాతం), సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న సమయం అంచనా వేసిన కాలక్రమాన్ని మించి పోయిందంటూ మండి పడింది.
నీటి లభ్యతను ఆడిట్ చేసిన కాగ్ కోచ్లలో నీటి కొరత గురించి తరచుగా వచ్చే ప్రజా ఫిర్యాదులను హైలైట్ చేసింది, తరచుగా నియమించబడిన నీటి కేంద్రాలలో నీటిని నింపక పోవడం లేదా నింపడంలో వైఫల్యం కారణంగా ఇది జరిగిందని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, రైల్వే బోర్డునీటి సరఫరా స్టేషన్లలో త్వరిత నీటి సరఫరా ఏర్పాటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుర్తించిన 109 స్టేషన్లలో 2023 మార్చి 31 నాటికి 81 స్టేషన్లలో నీటి సరఫరా సౌకర్యాలు అమలులో ఉన్నాయని ఆడిట్ పేర్కొంది. తొమ్మిది జోన్లలోని 28 స్టేషన్లలో, నిధుల పరిమితులు, కాంట్రాక్టర్ పని నెమ్మదిగా పురోగతి చెందడం, పనిని షెల్వింగ్ చేయడం, మార్పిడి చేయడం వంటి కారణాల వల్ల ఆలస్యం జరిగిందని స్పష్టం చేసింది. రైళ్లలో పరిశుభ్రత కార్యకలాపాలకు సంబంధించిన బడ్జెట్, ఖర్చులను కూడా ఆడిట్ పరిశీలించింది, టికెట్ల రేట్లను పెంచడంపై ఉన్నంత శ్రద్ద కేంద్రానికి ప్రయాణీకులకు కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందడం బాధాకరం.