
తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేడా అని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి ఈ గొడవలను తెరమీదకు తీసుకు వచ్చారంటూ మండిపడ్డారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని అన్నారు. సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ. పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించిందన్నారు.
దీనిపై విచారణకు ఆదేశించాలని తాను కోరుతానని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఎవరు మోసగాళ్లో పూర్తిగా తెలిసి పోయిందన్నారు. ములుగులో తనను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడని ఆరోపించారు సీతక్క. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను కవిత వెనకేసుకు రావడం పెద్ద డ్రామా అని కొట్టి పారేశారు. మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసి ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని, భవిష్యత్తులో అందరూ కలిసి పోతారని వీరంతా డ్రామా ఆర్టిస్టుల కంటే ఆరి తేరి పోయారని ఫైర్ అయ్యారు. కవితను విమర్శించిన మహిళా నేతలే నష్ట పోతారన్నారు.