
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము వచ్చాక కీలకమైన సంస్కరణలకు తెర తీశామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కొత్త విద్యా విధానం కోసం ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సమగ్ర విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాలని రేవంత్ రెడ్డి కోరారు.
10 సంవత్సరాల BRS పాలనలో పూర్తిగా నాశనమైన విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తాను విద్యా శాఖను కలిగి ఉండాలని ఎంచుకున్నానని అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు సాంప్రదాయకంగా రెవెన్యూ, ఆర్థిక , నీటిపారుదల శాఖలను తమ నియంత్రణలో ఉంచుకున్నారని తెలిపారు. కానీ తాను కావాలని ఈ కీలక రంగాన్ని పునరుద్ధరించడం నా ప్రాధాన్యత కాబట్టి నేను విద్యను పర్యవేక్షించాలని ఎంచుకున్నానని సీఎం స్పష్టం చేశారు. విద్యా శాఖను కలిగి ఉండటంపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ గా జవాబు ఇచ్చారు.
గత ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఇచ్చినప్పటికీ, 2017 తర్వాత ఆ హామీని నెరవేర్చలేదని, ఉపాధ్యాయులను నియమించలేదని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా తాము కొలువు తీరిన 55 రోజుల్లోనే 11,000 మంది ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. గత పాలన విద్యను వ్యాపారంగా మార్చిందని, విశ్వ విద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరత ఏర్పడిందని, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు వంటి ప్రముఖ సంస్థలను క్షీణించేలా చేసిందని కూడా ఆయన ఆరోపించారు.