
దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
అమరావతి : దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు జిల్లాల కలెక్టర్లు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. మానవీయ కోణంలో పని చేస్తే మంచి పేరు వస్తుందన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం అన్నారు చంద్రబాబు నాయుడు. అదే తరహాలో సమర్థులైన వారి కోసం కలెక్టర్ల పోస్టింగులు చేపట్టామని తెలిపారు. దీనికి అనుగుణంగా పని చేయాలన్నారు. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పని చేయాలన్నారు. పని తీరు చక్కగా ఉన్నవాళ్లను తామను ఎప్పుడూ మార్చ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం అవుతుందన్నారు.
సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో శాంతి భద్రతల విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పని చేసిన అధికారులు ఆర్బీఐ లాంటి సంస్థలకు వెళ్లారని చెప్పారు నారా చంద్రబబు నాయుడు. తాను అధికారులకు పూర్తిగా సపోర్ట్ అందిస్తానని, కానీ విఫలమైతే మాత్రం కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్ను సృష్టించాలని కోరుతున్నానని సీఎం చెప్పారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని పేర్కొన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామన్నారు.
కలెక్టర్లు, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. చెప్పినట్టుగా సూపర్ సిక్స్ను సక్సెస్ చేశాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్ధికి ఆర్ధిక సాయం చేస్తున్నాం. విద్యార్ధులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు. కానీ స్త్రీశక్తి పథకం సక్సెస్ అయిందన్నారు. 50 శాతం మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.