
అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మ వారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 18న ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవ కలశ స్థాపన, వాస్తుపూజ నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబరు 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్రిపుర సుందరి, సెప్టెంబరు 28న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, సెప్టెంబరు 29న శ్రీఅన్నపూర్ణా దేవి, సెప్టెంబరు 30న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.