
ఉల్లిగడ్డ రైతులను ఆదుకుంటామని ప్రకటన
అమరావతి : ఆంధప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉల్లి రైతులు. కనీస మద్దతు ధర రాక పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ ఆందోళన కూడా చేపట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లిగడ్డలను సాగు చేశారు కర్నూల్ జిల్లా రైతాంగం. పెద్ద ఎత్తున నష్టం చేకూరడంతో అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ సందర్బంగా కర్నూల్ మార్కెట్ యార్డును సందర్శించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్ర సర్కార్ ఆదుకోక పోతే ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు చంద్రబాబు నాయుడు.
ఈ మేరకు ఉల్లి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హెక్టారుకు రూ. 50 వేల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతుల నుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని చెప్పారు. 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించామని తెలిపారు. జగన్ హయాంలో 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770/-లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, కేవలం 250 మంది రైతుల దగ్గర 75 లక్షలు ఇచ్చి ఉల్లిని కొని రైతులని నిండా ముంచారని మండిపడ్డారు.
రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి తమ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొన్నారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పించే విధంగా పంటలకు కొనుగోలు ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, వారిని ఆర్థికంగా బలపరిచే విధంగా పలు సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తోందని అన్నారు.