
త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
అమరావతి : జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బీసీ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఏటా డీఎస్సీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రణాళికులు సైతం సిద్ధం చేశామన్నారు. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందజేయాలని నిర్ణయించామన్నారు. అమరావతిలో అయిదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మించనున్నామన్నారు.
సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చుతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు. చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు చెప్పారు సవిత. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. బీసీల అభ్యున్నతికి అందజేసే పథకాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు.