
అమ్మ వారిని దర్శించుకున్న వ్యవసాయ మంత్రి
విజయవాడ : బెజవాడలో ని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలలో భాగంగా ఈనెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించు కోనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వెల్లడించారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏకంగా 35 లక్షల లడ్డూలు సిద్దంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా శనివారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాన్ని, ప్రజలను అమ్మ వారు కాపాడాలని, దీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రాబు నాయుడు ప్రతిభా పాటవాలు, ముందు చూపు, దూర దృష్టి రాష్ట్రానికి పెన్నిధిగా మారిందని చెప్పారు. ఇలాంటి నాయకత్వం ఉండటం రాష్ట్రానికి దైవకృపతో సమానం అని పేర్కొన్నారు. దసరా శక్తి పండుగ. దుర్మార్గం పై సత్యం గెలిచిన శుభ సందేశాన్ని అందరికీ గుర్తు చేసే ఈ పర్వదినంలో, మనమంతా ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుదాం అని పిలుపునిచ్చారు.
నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్స్, మంచి నీరు సదుపాయాలు, ప్రసాదాలు అందుచేత, మరిన్ని సదుపాయాలను మంత్రి పరిశీలించారు. భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ ఏ ప్రాంతం నుండి వచ్చారో అడిగి తెలుసుకుని, సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అందరిని అడిగారు. ఇబ్బంది లేకుండా వసతులు ఉన్నాయంటూ భక్తులు సమాధానం చెప్పారు. ఆనందంగా అమ్మవారిని దర్శించుకుని, దూరప్రాంతాల వారు జాగర్తగా నివాసాలకు చేరుకోవాలని సూచించారు.