
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పోటెత్తారు
తిరుమల : తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, వసతి, రవాణా, కాలి నడకన వచ్చే భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామన్నారు. పలువురు శ్రీవారి సేవకులు, డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు, సిబ్బందితో ఈవో సింఘాల్ మాట్లాడారు. 28వ తేదీ గరుడ సేవ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మెన్, ఈవోలతో ఫోటోలు దిగారు. ఉత్సవాలు వచ్చే అక్టోబర్ నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.