
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రికి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు మంత్రిని ఘనంగా సన్మానించారు. మంత్రి సవిత మాట్లాడుతూ కురుబలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో నిలిపేలా కురుబలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కురుబలకు అధిక ప్రాధాన్యమిచ్చారని, ఎంపీలుగా ఇద్దరిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించారని వెల్లడించారు ఎస్. సవిత. కేబినెట్ లో కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ బాధ్యతలు కురుబ సామాజిక వర్గానికి చెందిన తనకు అప్పగించారని తెలిపారు. ఈ పదవుల కేటాయింపే కురుబలపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. కురుబల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సవితను కురుబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురబ సంక్షేమ సంఘ ప్రతినిధులు బెల్లెరెడ్డి ప్రసాద్, కార్యదర్శి మేజారి సదాశివ తదితరులు పాల్గొన్నారు.