
ఎన్నో ఏళ్ల పోరాటానికి దక్కిన ప్రత్యేక రాష్ట్రం
హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర పౌరుషానికి ప్రతీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం తెలంగాణలో అనేక పోరాటాలు ఇదే చైతన్యంతో జరిగాయని చెప్పారు. పదేండ్లు అధికారంలోఉన్నా, గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఏమాత్రం పట్టించు కోకుండా, నిర్లక్ష్యంతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి నమ్మక ద్రోహులుగా మిగిలి పోయారని ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్ధాల ఉద్యమాన్ని ఒకే కుటుంబం, ఒకే పార్టీకి ఆపాదించు కోవాలని చూశారని, ప్రజలు రెండు సార్లు గెలిపించే సరికి కారణజన్ముం అనుకుని విర్రవీగారని విమర్శించారు రేవంత్ రెడ్డి. మరి వీరు విశ్వాస ఘాతకులు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు.
పదేండ్ల పాలనలో టీజీపీఎస్సీని అంగడి సరుకుగా మార్చారనీ, దానిలో ఆర్ఎంపీ డాక్టర్ను సభ్యుడిగా నియమించి, ప్రశ్నాపత్రాలను జిరాక్స్ కేంద్రాల్లో అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీని యూపీఎస్సీ కంటే మెరుగ్గా తీర్చిదిద్దామని, ఉన్నత హోదాల్లో ఉన్న వారిని చైర్మెన్లు, సభ్యులుగా నియమించామని గుర్తు చేశారు. కొందరు కడుపు నిండా విషం పెట్టుకుని అభ్యర్థులను దెబ్బ తీయాలనుకున్నారని వ్యాఖ్యానించారు. గ్రూప్-1 పోస్టుల్ని రూ.రెండు కోట్లు, మూడు కోట్లకు అమ్ముకున్నానని తనపై కొందరు ఆరోపణలు చేశారని చెప్పారు. అసలు ఏనాడైనా మీతో కలిసి చారు అయినా తాగానా? అని ప్రశ్నించారు. 2023 డిసెంబర్లో కూడా ఇంత ఆందోళన చెందలేదని, గ్రూప్-1 నియామకాల విషయంలో ఆందోళన చెందానని అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్తే, తెలంగాణ భవిష్యత్ అని చెప్పారు.