
పార్లమెంటరీ పార్టీ చీఫ్ లావు క్రిష్ణదేవరాయులు
అమరావతి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు లావు క్రిష్ణదేవరాయులు . ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు . ఈ కుంభకోణంలో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 30 వేల మహిళల తాళి బొట్లు తెగిపోవడం వంటి విషాదకర పరిణామాలు రాష్ట్ర చరిత్రలో మిగిలి పోయాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా నిలిచిన మిథున్ రెడ్డి జైలు నుండి విడుదలైన తరువాత కూడా నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేయడం విచారకరం అన్నారు.
జగన్ ప్రభుత్వం కాలంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం గురించి యావత్ దేశం ఇప్పటికే తెలుసుకుందన్నారు. ఈ వ్యవహారంలో ప్రతి దశలోనూ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనేక వర్గాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. మద్యం పాలసీ రూపకల్పన నుండి సరఫరా ఆర్డర్లు మళ్లించడం, కంపెనీల నుండి లంచాలు వసూలు చేయడం, వాటిని తాడేపల్లి కేంద్రానికి మళ్లించడం వంటి అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ముఖ్యంగా కొన్ని సంస్థలకు మాత్రమే ప్రత్యేక ఆర్డర్లు ఇవ్వడం, బంగారం, నగదు రూపంలో లాభాలు పొందడం, హవాలా నెట్వర్క్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం వంటివి మద్యం కుంభకోణం తీవ్రతను చూపిస్తున్నాయని పేర్కొన్నారు ఎంపీ. ఈ వ్యవహారంలో అదాన్ డిస్టిలరీస్ వంటి సంస్థలతో సంబంధం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోందన్నారు. ప్రజల రక్తం, చెమటతో వచ్చిన సొమ్మును కుంభకోణాల ద్వారా దోచుకోవడమే కాకుండా, విషపూరిత మద్యం విక్రయించి బలహీన వర్గాలను దెబ్బతీసిన చరిత్ర మిథున్ రెడ్డిదని ధ్వజమెత్తారు. ప్రజల నుండి సానుభూతి పొందేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.