
వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శత్రువుల స్థావరాలను గురి చూసి ఖచ్చితంగా కొట్టామన్నారు.. ఆపరేషన్ సిందూర్లో కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం కళ్లారా చూసిందన్నారు. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రపంచం భారత్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు ఏపీ సింగ్. పాకిస్తాన్ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ధ్వంసం చేశామన్నారు. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.
భవిష్యత్తు సవాళ్లు అధిగమించేందుకు రక్షణ రంగంలో స్వావలంబన అవసరం అని అభిప్రాయ పడ్డారు ఏపీ సింగ్ . ఆపరేషన్ సిందూర్ సమయంలో 4 నుండి 5 పాకిస్తానీ ఫైటర్ జెట్లు, F-16 ధ్వంసం చేయడం జరిగిందని వెల్లడించారు. రాడార్లు, కమాండ్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను దెబ్బతీసిందని సింగ్ అన్నారు. ఆపరేషన్ సమయంలో C-130-తరగతి విమానం మరియు బహుశా అధిక విలువ కలిగిన నిఘా విమానం కూడా ఢీకొట్టబడిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ నష్టాల విషయానికొస్తే తాము వారి వైమానిక స్థావరాలను పెద్ద సంఖ్యలో దాడి చేశామన్నారు. ఈ దాడుల కారణంగా కనీసం నాలుగు ప్రదేశాలలో రాడార్లు, రెండు చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, రెండు చోట్ల రన్వేలు దెబ్బ తిన్నాయన్నారు. అంతే కాకుండా మూడు వేర్వేరు స్టేషన్లలోని వాటి మూడు హ్యాంగర్లు దెబ్బ తిన్నాయని చెప్పారు.