
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆరోపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని అన్నారు మాజీ సీఎం. మార్ట్లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు జగన్ రెడ్డి. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది ఎందుకని ప్రశ్నించారు.
కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం అని పేర్కొన్నారు. కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కాని విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీవాళ్లేనని ఆరోపించారు జగన్ రెడ్డి. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండిఉంటే, ఇవాళ ములకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కాని అలా జరగ లేదన్నారు జగన్ రెడ్డి.