
భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై కామెంట్స్
తిరుమల : ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారని, కావున ఒక్క నిమిషం పాటైనా స్వామి వారిని చూడాలనుకుంటారని చెప్పారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తాను కూడా భక్తులతో స్వయంగా మాట్లాడటం జరిగిందన్నారు. ఇక నుంచి క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఈవో. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం విడుదల చేస్తామన్నారు. నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చేసుకున్న వారికి అదే రోజు కాకుండా ఒక రోజు ముందుగా రావాలని తెలిపారు.
లడ్డూ ప్రసాద సేవ తిరిగి ప్రవేశ పెట్టే అంశంపై దృష్టి సారించామన్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల దానిని నిలిపి వేయడం జరిగిందన్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. అయితే ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం అన్నారు. . అన్న ప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని, తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు అనిల్ కుమార్ సింఘాల్.
3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారని తెలిపారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈవో..
చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వయో వృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించే విషయం పరిశీలిస్తామన్నారు.