మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశం
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రష్ట్రంలో వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చాలని కోరారు. ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా చూడాలన్నారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని స్పష్టం చేశారు సీఎం. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు సీఎం. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని స్పష్టం చేశారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ను ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియ జేయాలని, ఉద్దేశ పూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.






