నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నా, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని సూచించారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
నెలకు రూ. 2500 చొప్పున ఒక్కొక్క యువతికి కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేలు రూపాయలు బాకీ పడిందని.. ఆటో అన్నలకు, వృద్ధులకు ఇలా అందరికీ రేవంత్ సర్కార్ బాకీ పడిందంటూ గుర్తు చేశారు.కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తే.. వాటిని కూడా తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎక్కడా అని ప్రశ్నించండని చెప్పారు కేటీఆర్. ఇక.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కారును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించి.. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తు పైనుంచి మూడో నెంబర్లో ఉంటుందన్నారు. అందరూ జాగ్రత్తగా ఓటేయాలని సూచించారు.






