తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

VijayaBhaskar · October 27, 2025
Spread the love

మొంథా తుపానుతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కార‌ణంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమ‌వారం ఆయ‌న స‌చివాల‌యంలో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డిప్యూటీ సీఎం. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియ చేయాలని సూచించారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంద‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.