సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత థ్యాంక్స్
అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 60 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ సందర్బంగా విన్నవించిన వెంటనే నిధులు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం ఎస్. సవిత మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను గాలికి వదిలి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించక పోగా, కనీసం హాస్టల్ మరమ్మతులకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
ఇప్పటికే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఎంతమంది విద్యార్థులకు అందరికీ ఆ పథకాన్ని వర్తింప జేశామన్నారు మంత్రి సవిత. హాస్టళ్లలో భద్రతకు సీసీ కెమెరాలు, పరిశుద్ధమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలల్లో పే ఫోన్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో విద్యార్థులకు ఫోన్ లో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. బీసీ హాస్టళ్ల నిర్మాణాలకు రూ.60 కోట్లు మంజూరు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు బీసీ పక్షపాతి అని మరోసారి రుజువైందని సవిత స్పష్టం చేశారు.






