స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్య మెరుగు పర్చే చర్యలు మొదలు పెట్టామన్నారు. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, మొత్తం 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు పవన్ కల్యాణ్. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పటిన చోట్ల ప్రయత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళా దుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ. 3 వేలు చెల్లించనున్నామని పేర్కొన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతామన్నారు.
కోడూరు మండల పరిధిలో సముద్రం కట్టపై దెబ్బ తిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డ్ సాయం తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు గురై దెబ్బ తిన్న ఎదురుమొండి గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్ల కేటాయించామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని, దీని ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా స్పెషల్ ఆఫీసర్, టూరిజం శాఖ ఎండీ అమ్రపాలి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.






