newsseals.com
News

రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

VijayaBhaskar October 31, 2025
newsseals-HYDRAA
Spread the love

కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి

హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాలపరిదిలో 500 ప్లాట్లతో లేఔట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడడం ఇక్కడ గమనార్హం. ఇదే విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఔట్ వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్ తో 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేసినట్టు తేలింది.

కులకర్ణి అనే వ్యక్తి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేష్, సోమాని తో పాటు పలువురికి అమ్మేశారు. ఈ విషయమై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆశ్రయించారు. ఇలా దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యతో గత నెల సెప్టెంబరులో హైడ్రాను ప్రతినిధులు ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసి పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డు లు ఏర్పాటు చేశారు. దీంతో పార్కు కబ్జాకు తెరపడింది. ఇప్పుడు కాలనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.