మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక

VijayaBhaskar · November 3, 2025
Spread the love

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్

హైద‌రాబాద్ : బీసీలు కోరుతున్న‌ది న్యాయ ప‌ర‌మైన కోరిక అని స్ప‌ష్టం చేశారు ఎంపీ ఈటల రాజేంద‌ర్.
ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత భావనతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తు పొందారని పేర్కొన్నారు. కులం మతం పేదరికం విజ్ఞానికి అడ్డం కాదన్నారు ఎంపీ. డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి వల్ల నాణ్యత కోల్పోతున్నాం తప్ప రిజర్వేషన్ల వల్ల కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సమాజం, బీసీ జాతుల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు అనే ఆలోచన వచ్చిందన్నారు. తొందర పడకండి ఇది ఎక్కడికి పోదు. అందుకే మొన్న బంద్ విజయవంతం అయ్యిందని చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్. మీలాంటి సంఘాల పుణ్యమే బీసీ లీడర్ల గెలుపు సాధ్య‌మైంద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు.

జేఏసీ అంటేనే ఒక్కటే జెండా ఒక్కటే ఎజెండాగా ఉండాల‌న్నారు. ఇది కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు ఎంపీ. మనం ఇక్కడ పిడికెడు మందిమే ఉన్నామని, ప్రజల ఆశయాలకి అనుగుణంగా మనం పని చెయ్యాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మనకి సాధ్యం కానిది లేదు. కావాల్సింది కమిట్మెంట్ మాత్రమేనని, ఆశయాన్ని ముద్దాడే వరకు ఆగవద్ద‌ని పిలుపునిచ్చారు ఈట‌ల రాజేంద‌ర్. మంద కృష్ణ గారి ఉద్యమం చూసి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. గ‌త 30 ఏళ్లుగా జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమం అణిచి వేసే అధికారం ఎవరికీ లేదు అని అన్నారని చెప్పారు. కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు చట్ట సభల్లో రిజర్వేషను కావాలన్నారు. మంత్రివర్గంలో మన వాటా మనకు ద‌క్కాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. డబ్బులతో ఓట్లు కొనుక్కొనే వ్యవస్థను ధ్వంసం చేయాల‌న్నారు.