అందాయన్న అదనపు కమిషనర్
హైదరాబాద్ : హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందాయని అదనపు కమిషనర్ వెల్లడించారు. ప్రధానంగా ఆక్రమణలు, కబ్జాలపై ఎక్కువగా వినతిపత్రాలు వచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచడమే కాకుండా ఉన్ననాలుగు తూములను పూర్తిగా మూసేయడంతో ఏటా దాని విస్తీర్ణం పెరిగిపోయి పై భాగంలో ఉన్నలే ఔట్లన్నీ మునిగి పోతున్నాయని ప్లాట్ యజమానులు హైడ్రా ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో 93 ఎకరాల మేర ఉన్న చెరువు ఇప్పుడు 400ల ఎకరాలకు పైగా విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఈ చెరువు నుంచి నీళ్లు బయటకు పోక పోవడంతో కింద ఉన్న కుమ్మరికుంట, బందంకొమ్ము, శాంబునికుంట, ఇసుకబావి చెరువులకు నీరందక అవి కబ్జాలకు గురి అవుతున్నాయని వాపోయారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను హైడ్రా వెంటనే పరిష్కరించాలని కోరారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ సర్వే నంబరు 44, 45లో పాఠశాల భవనానికి కేటాయించిన 1967 గజాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురి అవుతోందని తెలిపారు. వెంటనే ఈ స్థలానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలని శ్రీ వెంకట సాయి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ లోని సర్వే నంబరు 75లో ప్రభుత్వ భూమి 1.23 ఎకరాల ఉంది. అందులో 1.10 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని కాపాడడంతో పాటు పార్కు కోసం కేటాయిస్తే శ్రీరాంనగర్ నివాసితులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గతంలో 100 ఎకరాల భూమిలో వెయ్యికి పైగా ప్లాట్లతో శ్రీరాంనగర్ కాలనీ లే ఔట్ వేశారని, ఇందులో ఎక్కడా పార్కుకోసం గజం స్థలం కూడా వదల్లేదన్నారు. నాలా పక్కన ఉన్న 1.10 ఎకరాల భూమిని పార్కు కోసం కేటాయించాలని కోరారు.
శేరిలింగంపల్లి మండలంలోని గుట్టలబేగంపేటలోని మేడికుంట చెరువును కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 24.19 ఎకరాలున్న చెరువుకు ఒక వైపు 80 అడుగుల రహదారి ఉండగా లోపలి వైపు నుంచి ఆక్రమణలు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ్మిడికుంట – సున్నం చెరువు మధ్య ఈ చెరువు అనుసంధానంగా ఉండేదని.ఇప్పుడీ చెరువు ఆక్రమణలకు గురైతే.. భూగర్భ జలాలకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో చెరువును అభివృద్ధి చేయాలని కోరారు.






