వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై జగన్ రెడ్డి పదే పదే నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్లు పాలించిన జగన్ వల్ల రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు. ఆయన చేసిన నిర్వాకం వల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. వ్యవసాయ రంగం నుండి పరిశ్రమల వరకు చీకటి దశకు నెట్టిన దోషిగా ప్రజల తీర్పులో నిలిచి పోయారని మంత్రి పేర్కొన్నారు. రైతుల కష్టాలు పెరిగినా, యువతకు ఉద్యోగాలు రాకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులు దక్కకపోయినా జగన్ మాత్రం నాటకాలు, అబద్ధాలు, ప్రచారాలు మాత్రమే చేశాడు అని విమర్శించారు. అందరి మీద ఆరోపణలు చేసి తానే నీతిమంతుడిగా నటించే రాజకీయాలు జగన్కి అలవాటయ్యాయని ఎద్దేవా చేశారు, కానీ రాష్ట్ర ప్రజలు ఆ డ్రామాలను ఇక నమ్మే పరిస్థితిలో లేరని హితవు పలికారు.
ప్రస్తుతం చంద్రబాబు–లోకేష్ జంట రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదులు వేస్తున్నప్పుడు, జగన్ వంటి మాటల నాయకులు చేసే ఆరోపణలు పని చేయవని, ప్రజలు నిజం ఏంటో బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. దమ్ము-ధైర్యం ఉంటే జగన్ గత ప్రభుత్వం లో జరిగిన వైఫల్యాలు, కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి పై , నిజాల గురించి బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. అబద్ధాలతో రాజకీయాలు చేసే వారి కాలం ముగిసిందన్నారు. నిజాయితీ పాలనకు పట్టం కట్టారని, అందుకే తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు అచ్చెన్నాయుడు. జగన్ తరచూ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలు ప్రజలు స్వయంగా చూస్తున్నారని అన్నారు.






