రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్ :- తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్ తో సహా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. బోరబండలోని సాయిబా బానగర్, జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని వివిధ అసోసియేషన్ల సభ్యులు, పలువురు అర్చకులు మంత్రి పొంగులేటి సమక్షంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, రెహ్మత్నగర్ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాధ్ విషయంలో కేటీఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపీనాధ్ తల్లిగారే ప్రకటించారని, గోపీనాధ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కల్వకుంట్ల కుటుంబ వైఖరి అందరికీ అర్దం అవుతుందన్నారు. గతంలో వేలాది మంది తెలంగాణ యువతను ఉద్యమానికి ఆహుతిచ్చిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేశారని ఆరోపించారు. తాజాగా కవితను కూడా బయటకు పంపి కాళేశ్వరంలో వచ్చిన కమీషన్లలో వాటా ఇవ్వకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కవిత జాగృతి సంస్ధ కార్యకర్తలు ఇప్పుడు బిఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో బుద్ది చెబుతారన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. హీన రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు మాగంటి గోపీనాధ్ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని అన్నారు.






