మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి
తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల, బయట క్యూలైన్లలోని సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
విజిలెన్స్, వైకుంఠం, ఆలయ సిబ్బంది క్యూలైన్ లో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. కార్య ఫౌండేషన్ USA ఇప్పుడున్న సాప్ట్ వేర్ ను రివ్యూ చేసి మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు ఆ సంస్థకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైకుంఠం, విజిలెన్స్ సిబ్బంది అందించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై ప్రతివారం సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, DGM (IT) వెంకటేశ్వర నాయుడు , కార్య ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు జయ ప్రసాద్, రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






