newsseals.com
News

ఎయిరో స్పేస్ సెంట‌ర్ తో భారీగా ఉద్యోగాలు

VijayaBhaskar November 26, 2025
newsseals-RevanthReddy
Spread the love

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఎయిరో స్పేస్ సెంట‌ర్ ఏర్పాటు కావ‌డం వ‌ల్ల భారీగా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంద‌ని చెప్పారు.పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోందని అన్నారు. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింద‌న్నారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయని అన్నారు.

ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయని చెప్పారు రేవంత్ రెడ్డి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందిందన్నారు.రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంద‌న్నారు సీఎం. నైపుణ్యతను మెరుగు పరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దామ‌ని తెలిపారు.