స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి
తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోందని చెప్పారు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి. ఎంతో మంది ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ప్రధానంగా భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారని శ్రీవారి సేవకుల గురించి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు.
ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్ స్కిల్స్, భక్తులతో నడవడిక, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయని తెలిపారు. దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో శ్రీవారి సేవకు సంబంధించి నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు సేవకు రాక మునుపే శిక్షణ అందించాలన్నారు. భక్తులకు ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.
ఈ శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించి, ఇతర సేవకులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పండితులు డా. మేడసాని మోహన్, డా. దామోదర్ నాయుడు, డా. శ్రీనివాస్, టీటీడీ ఛీఫ్ వీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో (FAC) కుమారి నీలిమ, సేవా సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






