కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ . వాటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ , లడఖ్ నుంచి వచ్చిన మొత్తం 5 ప్రతిపాదనలకు రూ.17.52 కోట్ల వ్యయంతో ఆమోదం లభించినప్పటికి నిధులు మాత్రం విడుదల కాలేదని వెల్లడించారు. లోక్ సభలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ హోమ్స్టేల అభివృద్ధి పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన జాతీయ ఉన్మత్త గ్రామ అభియాన్ (PM-JUGA) కింద, స్వదేశ్ దర్శన్ పథకానికి అనుబంద పథకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను పెంపొందించి, గిరిజన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ “గిరిజన ప్రాంతాల్లో హోమ్స్టేల అభివృద్ధి” పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ పథకం కింద గ్రామ సముదాయ అవసరాలకు రూ.5 లక్షల వరకు, పత్రి కుటుంబానికి రెండు కొత్త గదుల నిర్మాణానికి రూ.5 లక్షల వరకు, గదుల పునరుద్ధరణకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే, ఈ పథకం కింద ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి కూడా నిధులు విడుదల కాలేదని, అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ నిధుల వినియోగం జరగలేదన్నారు. జిల్లా వారీగా హోమ్స్టేల సంఖ్య లేదా నిధుల కేటాయింపు వివరాలు ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.






