లోక్ సభలో కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ వెల్లడి
ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం రూ. 1,965.65 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ వెల్లడించారు. లోక్ సభలో శుక్రవారం ఎంపీలు కేశినేని శివనాథ్, బస్తీపాటి నాగరాజు కలిసి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై పథకం కింద ఎంప్యానెల్మెంట్, ఆయుష్మాన్ కార్డుల పంపిణీ, నిధుల విడుదల తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖను ప్రశ్నించగా, ఆ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) కింద ఎంప్యానెల్ చేసిన ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో పెట్టినట్లు తెలిపారు. అలాగే దేశంలోని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా జిల్లాల వారీగా ఆయుష్మాన్ కార్డులకు సంబంధించిన పూర్తి (అభ్యర్థించినవి, ఆమోదించినవి, పంపిణీ చేసినవి, పెండింగ్లో ఉన్నవి) వివరాలు కూడా ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో వుంచినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకమైన ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) పథకం నిధులు కేంద్ర-రాష్ట్రాలు పంచబడతాయన్నారు. డిమాండ్ ఆధారిత పథకమైన ఈ పథకానికి సంబంధించి. గతంలో విడుదల చేసిన నిధుల వినియోగ ధ్రువపత్రాలు (Utilization Certificates) రాష్ట్రాల నుండి వచ్చిన అవసరాల ఆధారంగా భారత ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందన్నారు.
ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు (జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) ఈ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల వాటా 90:10 గా వుండగా, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వాటా 100%., మిగిలిన రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్రాల 60:40 గా వుందని వివరించారు.





