ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

VijayaBhaskar · December 21, 2025
Spread the love

స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్టు బాధ్యులు నారా భువ‌నేశ్వ‌రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో గ‌త 29 ఏళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించామ‌ని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన అవసరాలు తీర్చుతూ యూనిఫాం అందించిన‌ట్లు పేర్కొన్నారు. పేద పిల్లల‌కు రూ.3.50 కోట్లు స్కాలర్షిప్పులను అందించనిట్లు వెల్ల‌డించారు. మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకులు ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించామ‌ని చెప్పారు. ఇదంతా ప్రజలు, దాతల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకు వ‌స్తున్నార‌ని చెప్పారు నారా భువ‌నేశ్వ‌రి. పేదల కోసం ట్రస్ట్ ఖర్చు చేస్తున్న నిధులకు దాతలు సహకారం అందిస్తుండ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. దాతలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం అని పేర్కొన్నారు. యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.